- కనీస మద్దతు ధర కాగితాలకే పరిమితం
- అమలుకు నోచని జీఓ మూడు
- సక్రమంగా వినియోగించని సబ్ ప్లాన్ నిధులు
- మద్యం ముడుపుదారులను వెల్లడించాలి
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ తీర్మానం
రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్ కోతలు తదితర ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం విమర్శించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆది, సోమవారాల్లో హైదరాబాద్లోని ఎంబి భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, పాలకవర్గం పదవులు కాపాడుకోవడమే పరమావధిగా పనిచేస్తూ, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో 876 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 52 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే రూ.4,500 కోట్ల విలువైన పంటలకు నష్టం జరిగింది. రుణగ్రస్తులైన రైతులు గత రెండు మాసాల్లోనే 250 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వ సాయం అందలేదు. ప్రస్తుతం మార్కెట్లలో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు అమలుకావటం లేదు. క్వింటాలు రూ.1,110 అమ్మాల్సిన ధాన్యాన్ని రూ.800-900 మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం, పత్తి, పసుపు పంటల ధరలు పూర్తిగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధరలకే కొనుగోలు చేస్తామంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆర్భాటంగా చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్లు జరపడం లేదు. జలయజ్ఞం కాంట్రాక్టర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే పనులు నిలిపేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.