Thursday, December 1, 2011

'రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐ' అంశంపై బుక్‌లెట్‌ విడుదల- రాఘవులు

'రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐ' అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన బుక్‌లెట్‌ను  రాష్ట్ర కార్యదర్శ రాఘవులు ఆవిష్కరించారు. ఎఫ్‌డిఐలను ప్రవేశపెట్టిన దేశాల్లో వీటి ద్వారా వంద మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తే వెయ్యి మంది ఉద్యోగాలు కోల్పోయిన దాఖలాలు న్నాయని, ఆగేయాసియా దేశాల్లో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. వాల్‌మార్ట్‌ వచ్చిన తర్వాత అమెరికాలోనూ ఇదే స్థితి నెలకొందన్నారు. అక్కడ వాల్‌మార్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఎఫ్‌డిఐలను అనుమతించటం వల్ల దేశంలో ధరలు తగ్గుతాయని ప్రధాని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగాయనే సాకుతో దేశంలో ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారని, అయితే అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ ధరలు తగ్గించలేదని విమర్శించారు. ఎరువులు, పెట్రోల్‌ ధరలపై నియంత్రణ ఎత్తేయటమే దీనికి కారణమన్నారు. 
              ఎఫ్‌డిఐల వల్ల దేశీయ మార్కెట్‌లోకి 70 శాతం విదేశీ వస్తువులు వచ్చిపడితే మన దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి దెబ్బతినిపోయినప్పటికీ కొద్దిమంది వినియోగదారులకు చౌక ధరలకే వస్తువులను అందిస్తామని చెప్పటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. ఎఫ్‌డిఐలు అమల్లోకి వచ్చిన తర్వాత విదేశీ షాపులను ప్రతిఘటిస్తామని, ఈ అంశంపై మిగతా అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం వ్యాపారులు నిర్వహించ తలపెట్టిన బంద్‌లో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు.

No comments:

Post a Comment